అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోన కోవిడ్-19 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యతిరేకంగా గొప్పగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ పరీక్ష సామర్థ్యం తమ వద్ద ఉందన్నారు. తాము భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వల్లే పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 45 మిలియన్ల పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అన్ని పరీక్షలు చేయబట్టే ఎక్కువ కేసులు వెలుగు చూశాయన్నారు.
కొన్ని దేశాలు ఆసుపత్రికి వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆయా దేశాల్లో కేసులు ఎక్కువగా లేకపోవడానికి ఇదే కారణమన్నారు. తమకు కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున పరిస్థితి కత్తిమీద సాములా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మరణాల రేటు మాత్రం తమ వద్దే తక్కువని తెలిపారు. తాము కొవిడ్కు వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నామని పేర్కొన్నారు.