అఫ్ఘాన్ రాజధాని కాబూల్లో గురువారం జరిగిన ఆత్మాహుతి కారుబాంబు దాడిలో అమెరికా సైనికుడు సహా 12 మంది మరణించారు. ఈ పేలుడుకు కారణం తామేనని తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్ నేతలతోపాటు ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో జరగాల్సిన శాంతి చర్చలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు. మేరీల్యాండ్లోని అధ్యక్ష భవనం క్యాంప్ డేవిడ్లో అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, తాలిబన్ సీనియర్ నేతలతో ఆదివారం తాను రహస్యంగా సమావేశం కానున్నట్టు శనివారం ట్రంప్ ట్వీట్ చేశారు.
గురువారం జరిగిన కారు బాంబు పేలుడు తమపనేనని తాలిబన్ ప్రకటించడంతో ఆ భేటీని, శాంతి చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఈ సందర్భంగా తాలిబన్లపై విరుచుకుపడ్డారు. తమ పంతం నెగ్గించుకునేందుకు, చర్చల్లో పైచేయి సాధించడం కోసం ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతారని ప్రశ్నించారు. అర్థవంతమైన ఒప్పందం కుదరాలనే నైతిక అర్హత వారికి లేదని ట్రంప్ స్పష్టం చేశారు.