చమురు ధరల ప్రభావం గ్యాస్ పై కూడా పడింది. ప్రతి నెల సంస్థలు సిలిండర్ ధరను సవరిస్తూ ఉంటాయి. తాజగా నాన్ సబ్సిడీ 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తాజాగా రూ.15 మేర పెంచింది..గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం. గ్యాస్ సిలిండర్ ధర జూలై నెలలో రూ.100, ఆగస్ట్ నెలలో రూ.62 మేర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు దిగిరావడం ఇందుకు కారణం. తర్వాత సెప్టెంబర్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.16 పైకి కదిలింది. మళ్లీ రూ.15 పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది. అదనంగా సిలిండర్ కావాలంటే మాత్రం మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంది.
గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఎల్పీజీ సిలిండర్ రేట్లను సమీక్షిస్తూ ఉంటాయి. సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ రేట్లు, అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి అంశాలు ప్రాతిపదికన ధరను మారుస్తూ ఉంటాయి. భారత్కు ప్రధాన క్రూడ్ సరఫరాదారైన సౌదీ ఆరామ్కోపై డ్రోన్ దాడి నేపథ్యంలో దేశానికి ముడి చమురు సరఫరా తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దేశీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం సరఫరా యథావిథిగా కొనసాగుతుందని, ఎలాంటి అంతరాయం లేదా తగ్గుదల ఉండదని స్పష్టం చేశాయి. దసరా పండగ ముందు ధరల పెంపు సామాన్యులకు భారంగా మారింది.