ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘జాతీయ వైద్య మండలి బిల్లు’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైద్యసిబ్బంది ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ ఒకరోజు నిరసనకు దిగారు.
రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది కూడా నిరసనలో పాల్గొనడంతో అత్యవసర వైద్యసేవలు తప్ప మిగిలినవి ఎక్కడికక్కడ నిలిచిపోయి రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలోని వైద్యులు నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. అలాగే, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోనూ వైద్యులు, సిబ్బంది ఆందోళనలో పాల్గొన్నారు. తమ ఆందోళనపై ప్రభుత్వం స్పందించకుంటే నిరసన మరింత తీవ్రం చేస్తామని వైద్య సిబ్బంది హెచ్చరించారు.