ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో శస్త్రచికిత్స చేసుకున్నా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఆపరేషన్ అనంతరం కడుపులో కత్తెర మరిచిపోయన ఘటన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో ఇదే తరహాలో మరో ఘటన జరిగింది. కాకపోతే అక్కడ కత్తెర మరచిపోతే… ఇక్కడ దూది మరిచిపోయారు. వివరాల్లోకి వెళితే… సిద్ధిపేట జిల్లా నంగునూరుకు చెందిన జంగిటి స్వప్న గత నెల 13న ప్రసవం కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలో చేరింది.
ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఆ సమయంలో స్వప్నకు తీవ్ర రక్తస్రావం కావడంతో దానిని ఆపేందుకు వైద్యులు దూది ఉండను అమర్చారు. సర్జరీ అనంతరం దూదిని తీయటం మరిచిపోయిన డాక్టర్లు అలాగే ఆమెకు కుట్లు వేసేశారు. డిశ్చార్జ్ అయిన అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి చేరింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా స్వప్నకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ చేయడంతో స్వప్న కడుపులో దూది ఉండ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి దానిని తొలగించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబసభ్యులు మండిపడ్డారు..
తెలంగాణలో నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదు: పొన్నం ప్రభాకర్