మతిమరుపు వైద్యురాలి నిర్లక్ష్యం తో ఓ మహిళ నాలుగేళ్లు నరకయాతన పడింది. శస్త్రచికిత్స అనంతరం బాబు జన్మించాడని సంతోషించినా తరువాత కడుపు నొప్పితో ప్రతిరోజూ అవస్థ పడింది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన రమాదేవి.. సమస్య ఏదో తెలియక ఎన్ని ఆసుపత్రులు తిరిగినా.. మందులు మార్చినా ప్రయోజనం లేకపోయింది. ఎట్టకేలకు వారం కిందట మరో వైద్యుడు శస్త్ర చికిత్స చేసి నయం చేశారు.
గతంలో ప్రసవం కోసం శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు.. మహిళ కడుపులో మరిచిపోయిన మాప్ (శస్త్రచికిత్స సమయంలో రక్తాన్ని నిలువరించేందుకు వాడే బట్ట)ను ఆయన బయటకు తీశారు. నాలుగేళ్లుగా సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. ఎకరంపైగా ఉన్న భూమిని అమ్ముకున్నామని రమాదేవి భర్త పెంటయ్య ఆవేదనతో చెప్పారు. కడుపులో ఉన్న బట్ట కారణంగా అనేకసార్లు అబార్షన్ అయినట్లు తెలిపారు.