ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా వైద్య సేవలండిచాల్సిన వైద్యుడు లంచాలకు అలవాటు పడ్డాడు. చేతిలో డబ్బు పెడితే కానీ.. రోగిపై స్టెతస్కోప్ పెట్టడు ఓ డాక్టర్. లంచం ఇవ్వాలని రోగులను ఇబ్బంది పెడుతున్న ఆ వైద్యుడిని ఓ రోగి ఏసీబీ అధికారులకు పట్టించాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని కుర్లాప్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో నితిన్ చివటే అనే వ్యక్తి డాక్టర్గా సేవలందిస్తున్నాడు.
అక్కడ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలంటే రూ. 30 లంచం ఇవ్వాలి. అంతే కాదు స్లైన్ బాటిల్ ఎక్కించాలంటే రూ. 100 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఓ రోగి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికెళ్తే రూ. 30 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇస్తేనే ఇక్కడ వైద్యం అని డాక్టర్ చెప్పడంతో సదరు రోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రోగి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో డాక్టర్ నితిన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.