ఇది నాలుగు దశాబ్దాల నాటి సంఘటన . మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు “మహా ప్రస్థానం” చదివిన తరువాత నాకు కవిత్వం వ్రాయాలన్న ఆలోచన మొదలైంది . ఇంటర్మీడియట్ పుస్తకాలకన్నా నాకు కవిత్వ పుస్తకాలంటేనే ఎక్కువ ఇష్టం . అవే చదివేవాడిని . శ్రీ శ్రీ , బాల గంగాధర తిలక్ , దాశరధి మొదలైన కవుల గ్రంధాలను చదివేవాడిని . అలా వాటి స్పూర్తితో నేను వ్రాసిన “మానవత” కవితా గ్రంధానికి మహాకవి శ్రీశ్రీ ముందు మాట వ్రాసారు . అంతేకాదు మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి మానవత పుస్తకాన్ని ఆవిష్కరించారు .
హైదరాబాద్ నగర్ కేంద్ర గ్రంధాలయం లో ఈ కార్యక్రమాన్ని కిన్నెర రఘురాం ఏర్పాటు చేశాడు . ఈ సభకు అప్పటి హై కోర్ట్ న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు అధ్యక్షత వహించారు . నిర్మాత , దర్శకుడు యు. విశ్వేశ్వర రావు ముఖ్య అతిధి , ప్రత్యేక అతిధులుగా జి . ఎస్ వరదా చారి , ఆచార్య తిరుమల వచ్చారు . నిర్మాత దర్శకుడు పి . పుల్లయ్య , ఆవుల మంజులత , అన్నయ్య కోటేశ్వర రావు , జర్నలిస్టు మిత్రులు ఎంతో మంది పాల్గొన్నారు .
ఈ పుస్తకాన్ని అప్పటి హైకోర్టు న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారికి అంకితం ఇచ్చాను . విశ్వేశ్వర రావు గారు మద్రాస్ నుంచి వాస్తు ఆరోజు హిందూ దిన పత్రిక తెచ్చారు . అందులో ” Bhageeratha – He Brought Ganga down to earth to purify the souls of sinners” అని వుంది . విశ్వేశ్వర రావు గారు ఇది చదివి సభలో వినిపించారు . ఈ భగీరధుడు కూడా సాహిత్య గంగను మధిస్తాడని ఆశిస్తున్నా ” అని చెప్పారు .
మిగతా వక్తలందరు నన్ను ఆశీర్వదించారు . మహాకవి శ్రీ శ్రీ తో మాట్లాడటమే గొప్ప అనుకునే ఆరోజుల్లో వారితో ముందు మాట వ్రాయించుకోవడమే కాక స్వయంగా నా పుస్తకాన్ని ఆవిష్కరించడం నిజంగా అది నా సాహిత్య జీవితానికి గట్టి పునాది. అయితే ఈ సభకు ముందు శ్రీశ్రీ ని సభలో పాల్గొనవద్దని విరసం వారు ఘెరావ్ చేశారు . ఈ సభను కిన్నెరా వారు ఏర్పాటు చేశారు . దీనికి అధ్యక్షులు ఎమ్ . వి . నారాయణ రావు గారు . అప్పుడు డీజీపీ .
నక్షలైట్లను చంపించిన నారాయణ రావు గారు అధ్యక్షులు గా వున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి వీల్లేదని విరసం నాయకులు అడ్డుకున్నారు . “నేను వెళ్లాల్సిందే ” అని శ్రీ శ్రీ వారితో చెప్పారు . “మీకు విరసం కంటే ఈ సభ ఎక్కువా ?” అని వారు శ్రీశ్రీ ని సూటిగా అడిగారు . “అవును ప్రస్తుతం నాకు ఈ సభే ఎక్కువ. ఇందుకోసమే నేను మద్రాస్ నుంచి వచ్చాను ” అని చెప్పారు .
శ్రీ శ్రీ గారి సమాధానంతో వారు నిర్ఘాంత పోయారు . ఆ తరువాత శ్రీ శ్రీ గారు వచ్చి పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు . ఈ ఘటన తరువాత శ్రీ శ్రీ గారిని విరసం నుంచి బహిష్కరించారు . నా తొలి పుస్తక సభ జూన్ 1, 1980 న ఓ చరిత్ర సృష్టించింది . ఇది నాలుగు దశాబ్దాల నాటి మధుర స్మృతి .
– భగీరథ
ఓ బేబీ : భారీ కటౌట్ పై నెటిజన్ కామెంట్… సమంత రియాక్షన్