ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను వాజ్పేయీతో పోల్చుకోవడం హాస్యాస్పదమని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. చెన్నైలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మోదీ ఎప్పటికీ వాజ్పేయీ కాలేరని స్టాలిన్ వ్యాఖ్యానించారు. గతంలో డీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమేనని, కానీ వాజ్పేయీ లాంటి నిర్ణయాత్మక రాజకీయాలు మోదీ చెయ్యలేరని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో మోదీ ఇటీవల వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తుకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటుందని అన్నారు. మోదీ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్టాలిన్ తేల్చిచెప్పారు. వాజ్పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోయారని, కానీ ఇప్పుడు బీజేపీలో అలాంటి నాయకత్వం లేదని స్టాలిన్ అన్నారు.