సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా నటించిన సినిమా ‘డీజే టిల్లు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.
తాజాగా “రాజ రాజ ఐటం రాజ.. రోజ రోజ క్రేజీ రోజ.. పటాస్ పిల్ల పటాస్ పిల్ల పాట విడుదలైంది. ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా, శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అద్భుతంగా ఆలపించారు.
గీత రచయిత కిట్టు విస్సా ప్రగడ మాట్లాడుతూ…‘నాకు సంగీత దర్శకుడు శ్రీచరణ్ ముందు పల్లవి వరకు ట్యూన్ పంపించారు. అది విన్నప్పుడు హుక్ లైన్ దగ్గర ‘పటాసు పిల్లా…’ అని తట్టింది. మా దర్శకుడితో పాటు మిగతా అందరికీ నచ్చింది. ఆ తర్వాత దర్శకుడిని పాట సందర్భం ఏమిటో అడిగి తెలుసుకుని రాశా. పాటలో ఎటువంటి సన్నివేశాలు ఉంటాయో? విమల్ నాకు చాలా వివరంగా కళ్ళకు కట్టినట్టు రాసి పంపారు. అందువల్ల, కొత్తగా రాయడం… పోలికలు వాడటం సాధ్యపడింది.
నేను శ్రీ చరణ్కి దాదాపు ముప్పై పాటల వరకూ రాసి ఉన్నాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే పాట మరో స్థాయికి వెళ్తుందని నమ్మకం కలిగింది’ అన్నారు.
ఈ సినిమాను ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి నిర్మిస్తోంది. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.