శంషాబాద్ దిశ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. తిరుపతిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆవేశపూరితంగా పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఘటన గురించి మాట్లాడుతూ ఆడపిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చేంతవరకు ఓ అన్నగా, ఓ తమ్ముడిగా గుండెలు ఎలా కొట్టుకుంటాయో తనకు తెలుసని, తాను ఆడపిల్లల మధ్య పెరిగిన వాడిని అని పవన్ వ్యాఖ్యానించారు.
తాను షూటింగ్ లకు వెళ్లినప్పుడు పొట్టకూటి కోసం రూ.1000, రూ.2000 వేల కోసం వచ్చే జూనియర్ ఆర్టిస్టులు తమతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వచ్చేవారని, కానీ వాళ్లను చూసి జనాలు ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక కర్ర పట్టుకుని వారికి కాపలా నిల్చునేవాడినని అన్నారు. కొన్ని సందర్భాల్లో తన కారు ఇచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయని పవన్ వివరించారు.