telugu navyamedia
క్రీడలు వార్తలు

కుల్దీప్ కంటే అక్షర్ పటేల్ కే అవకాశం ఉంది : దీప్ దాస్‌గుప్తా

చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. మొదటి టెస్ట్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అండగా రాణించడంలో షాబాజ్ నదీమ్‌, వాషింగ్టన్ సుందర్ విఫలమయ్యారు. అయితే నదీమ్ నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌పై ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేకపోయాడు. దీంతో శనివారం నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో నదీమ్‌ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్ ‌యాదవ్‌కు మరోసారి చోటు దక్కే అవకాశం లేదని చెప్పకనే చెప్పాడు. నదీమ్ తన అంచనాల్ని అందుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ రెండు ఇన్నింగ్స్‌ల్లో నదీమ్ డకౌట్ అయ్యాడు. మొత్తంగా తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసినా.. భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. షాబాజ్‌ నదీమ్ స్థానంకు కుల్దీప్ ‌యాదవ్‌, అక్షర్ పటేల్ పోటీలో ఉన్నారు. రెండో టెస్టులో కుల్దీప్‌కు బదులు అక్షర్ తుది జట్టులో చోటు దక్కించుకునే ఎవకాశాలే ఎక్కువగా ఉన్నాయని దీప్ దాస్‌గుప్తా అంటున్నారు. తాజాగా దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ… ‘చెపాక్ మైదానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో టెస్ట్ సమయానికి ఫిట్‌నెస్‌ సాధిస్తే.. నదీమ్ స్థానంలో జట్టులోకి వస్తాడు. తుది జట్టులో మరో మార్పు ఉండదని అనుకుంటున్నా. అక్షర్ వస్తే.. భారత బ్యాటింగ్ లైనప్ కూడా బలోపేతం అవుతుంది’ అని అన్నాడు. నిజానికి అక్షర్ మంచి బ్యాట్స్‌మన్‌. లోయర్ ఆర్డర్‌లో అతడు చేసే పరుగులు జట్టుకు ఉపయోగపడతాయి.

Related posts