telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాచీ కళ్ళు దానం… మాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అంత్యక్రియలు పూర్తి

Saachi

ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సాచీ (కె.ఆర్.సచ్చిదానందన్) గురువారం రాత్రి కన్నుమూశారు. గుండెపోటు, మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడంతో త్రిశూర్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 48 ఏళ్లు. మాలీవుడ్‌లో కథా రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సాచీ.. ఈ ఏడాది విడుదలైన ‘అయ్యప్పనుమ్ కొషియుం’ సినిమాతో సౌత్‌లో బాగా పాపులర్ అయ్యారు. దీంతో సాచీ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. సాచీ మృతి పట్ల మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, సాచీ కోరిక మేరకు ఆయన కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. హాస్పిటల్‌లో కళ్లను దానం ఇచ్చిన తరవాత ఆయన పార్థివదేహాన్ని కోచి తీసుకువచ్చారు. సాచీ కేరళ హైకోర్టులో న్యాయవాది కూడా కావడంతో ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఛాంబర్ హాల్‌లో ఉంచారు. అక్కడే సినీ ప్రముఖులు కూడా సాచీకి నివాళులు అర్పించారు. మలయాళ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడ్, లాల్, సురేష్ కృష్ణ, ముకేశ్ తదితరులు సాచీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రజలు, సినీ ప్రముఖులు సందర్శన అనంతరం సాచీ పార్థివదేహాన్ని తమ్మనంలోని ఆయన ఇంటికి తరలించారు. అక్కడి నుంచి రావిపురం శ్మశాన వాటికకు అంత్యక్రియల నిమిత్తం తీసుకువెళ్లారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో సాచీ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, సాచీతో పనిచేసిన ఎంతో మంది టెక్నీషియన్స్ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సాచీ మృతదేహాన్ని చూసిన చాలా మంది టెక్నీషియన్లు బోరున విలపించారు.

Related posts