సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు మధ్య మా ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. నువ్వా నేనా అంటూ జరిగిన మా అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. గతంలో ఎన్నడు లేనంతగా ఈసారి మా ఎన్నికల పోలింగ్ నమోదైంది.
సాధారణ రాజకీయ ఎన్నికలను తలదన్నె రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఈసారి జరిగాయి. మా అసోసియేషన్లో ఉన్నది 900 మంది.. అయినా రాష్ట్ర ఎన్నికలను తలపిస్తూ.. ఆరోపణలు, విమర్శలు ఒక్కటేమిటి ఎన్నో ఆసక్తికర పరిణామాల మధ్య మా ఎన్నికలు జరిగాయి.
ఇదిలాఉంటే.. ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. లోకల్ నాన్ లోకల్ వివాదంతో పాటు.. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వరకూ.. MAA ఎన్నికలపై ప్రభావం చూపించాయి. ఇండస్ట్రీ రెండుగా విడిపోయిందా అన్నంత అభిప్రాయం సాధారణ ప్రజల్లోనూ కలిగేంతవరకూ ఈ పరిణామాలు ప్రభావం కలిగించాయి. ప్రాంతీయ వాదం వెలుగులోకి వచ్చింది. తెలుగు వాడు కాదంటూ నన్ను ఓడించారని.. అలాంటి అసోసియేషన్ లో ఉండలేనని ప్రకాష్ రాజ్ నిన్న మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇక మా ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య జరిగిన వాగ్వాదాలపై పలువురు పెద్దలు, సీనియర్లు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సైతం మా ఎన్నికలపై స్పందించారు.ఇంతటి అలజడి.. చిత్ర పరిశ్రమకు మంచిది కాదని అన్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా నటించిన పెళ్లిసందD సినిమా ప్రమోషన్ కోసం విశాఖ వెళ్లిన రాఘవేంద్రరావు.. మీడియాతో మాట్లాడారు. సినిమా పెద్దలంతా కలిసి మా అధ్యక్షుడిగా ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అదే మంచి పద్ధతి అని ..మంచు విష్ణు..మా అధ్యక్షుడిగా రాణిస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.