telugu navyamedia
సినిమా వార్తలు

డ్రగ్స్‌ కేసు: ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్‌

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణ ప్రారంభమైంది. డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తనయుడు ఆకాష్‌ పూరి, చార్టెడ్‌ అకౌంటెంట్‌తో కలిసి పూరి జగన్నాథ్‌ ఈడీ కార్యాలయ్యానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది.విదేశీ బ్యాంక్‌ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ‘ఫెమా’ కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

డ్రగ్స్‌ కేసులో కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మొదటి రోజు పూరీ జగన్నాథ్‌ విచారణకు వచ్చారు. 2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా కొనసాగనుంది. మనీలాండరింగ్‌ కోణంలోనే వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ.. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంక్ ఖాతాలు పరిశీలించే అవకాశం ఉంది.

ఈ వ్యవహారంలో ఛార్మి – సెప్టెంబర్‌ 2, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ – సెప్టెంబర్‌ 6, రాణా దగ్గుబాటి – సెప్టెంబర్‌ 8, రవితేజ – సెప్టెంబర్‌ 9, శ్రీనివాస్‌ – సెప్టెంబర్‌ 9, నవదీప్‌ – సెప్టెంబర్‌ 13, ఎఫ్‌ క్లబ్‌ జీఎం – సెప్టెంబర్‌ 13, ముమైత్‌ ఖాన్‌ – సెప్టెంబర్‌ 15, తనీష్‌ – సెప్టెంబర్‌ 17, నందు – సెప్టెంబర్‌ 20, తరుణ్‌ – సెప్టెంబర్‌ 22 వ తేదీన హాజరు కావాల్సి ఉంది.

Related posts