telugu navyamedia
సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్”కు షాకిచ్చిన దిల్ రాజు

Dil-Raju

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్‌ శంకర్‌”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు ముస్తాబయింది.

‘టెంపర్’ తర్వాత మళ్లీ సక్సెస్ అందుకోని పూరి ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాత కూడా పూరి జగన్నాథే. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ పరంగా మంచి బిజినెస్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ను దిల్ రాజు ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయిద్దామని భావించాడట పూరి. కానీ దిల్ రాజు.. పూరి జగన్నాథ్ లేటెస్ట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ని విడుదల చేయడానికి ఆసక్తి చూపించలేదట. అందుకు కారణం పూరి గత చిత్రం ‘మెహబూబా’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడమే అంటున్నారు. పూరి తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘మెహబూబా’ను దిల్ రాజే పంపిణీ చేశాడు. ఈ నేపథ్యంలోనే ‘ఇస్మార్ట్ శంకర్’ను రిలీజ్ చేయడానికి నో చెప్పాడట దిల్ రాజు. దీంతో ఇప్పుడు మరో పెద్ద పంపిణీ సంస్థ ద్వారా ఈ సినిమాను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాడట పూరి.

Related posts