కోపానికి చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చాలా దూరంగా ఉంటాడు. అంత త్వరగా ఎవరి మీదా తన ప్రతాపాన్ని చూపడు. అందుకే అభిమానులు ధోనీని ‘మిస్టర్ కూల్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోనీకి నిన్నటి మ్యాచ్లో కోపం కట్టలు తెంచుకుంది. సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్ మీద అరిచేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 39 పరుగులు కావల్సి ఉంది. ఈ సమయంలో చాహర్ నోబాల్స్ వేశాడు. దీనితో ప్రత్యర్థి జట్టుకు రెండు ఫ్రీహిట్స్ వచ్చాయి. అంతే, హుటాహుటిన చాహర్ వద్దకు వచ్చిన ధోనీ తొలుత కోప్పడ్డాడు. తర్వాత పరిస్థితి వివరించాడు. ఇందుకు చాహర్ కూడా ఫీలవ్వలేదు. ధోనీ సలహా తర్వాత చాహర్ వేసిన ఓవరు ఆఖరు బంతికి కీలక బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో ధోనీ సేన పంజాబ్ జట్టుపై 22 పరుగులు తేడాతో గెలుపొందింది.