ధోనీ మైదానంలో ఉన్నప్పుడు పెద్దవాడిలా.. మైదానం బయట చిన్నపిల్లాడిలా మారిపోతున్నాడు. మామూలుగా మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను ఓ ఆటాడుకునే ధోనీ.. ఏ మాత్రం సమయం దొరికినా కూతురు జీవాతో ఆటలాడుతుంటాడు. తన కూతురుతోనే కాదు.. ఎక్కడ పిల్లలు కనిపించినా వాళ్లతో సరదాగా గడిపేస్తుంటాడీ జార్ఖండ్ డైనమైట్. శనివారం చెన్నై వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగియగానే మైదానంలోకి వచ్చిన ధోనీ పిల్లలతో ఆడుతూ కాసేపు సందడి చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు ఇమ్రాన్ తాహీర్, షేన్వాట్సన్.. తమ ఇద్దరు కుమారులకు సరదాగా పరుగు పందెం పెట్టారు. ఆ పోటీలో తాహీర్ కుమారుడు కొంచెం తేడాతో ఓడిపోయాడు. ఇది గమనించిన ధోనీ మళ్లీ వాళ్లిద్దరినీ పరుగెత్తాలంటూ.. వాళ్లతో పాటు పరుగులో పాల్గొన్నాడు. పరుగులో వెనకబడ్డ తాహీర్ కుమారుడిని తన చేతులతో ఎత్తుకొని పరుగెత్తాడు. దాంతో విజయం సాధించానంటూ తాహీర్ కుమారుడు సంబరాలు చేసుకున్నాడు.
ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్ అయింది. ‘జూనియర్ పరాశక్తి ఎక్స్ప్రెస్, జూనియర్ వాట్టో పరుగుపందెంలో ధోనీ పాల్గొనడం వెలకట్టలేని సందర్భ’మంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. దీనిపై స్పందించిన అభిమానులు.. ‘పరాశక్తి ఎక్స్ప్రెస్(తాహీర్) పిక్స్ వికెట్స్ అండ్ రన్స్.. తాలా(ధోనీ) పిక్స్ జూనియర్ పరాశక్తి ఎక్స్ప్రెస్ అండ్ రన్స్’ అంటూ పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్లో ధోనీ 23 బంతుల్లో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో చెన్నై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.