నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. వైట్ కాలర్నేరాలను నియంత్రించాల్సి ఉందన్నారు. చిన్న పిల్లలపై జరగుతున్న నేరాల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందని తెలిపారు.
గతేడాది ఏడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదంలో మరణించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన కల్పిస్తామని అన్నారు. గతేడాది సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. పోలీస్ అకాడమీ, ఫోరెన్సిక్ ల్యాబ్, ఉగ్రవాద వ్యతిరేక శిక్షణా కార్యాలయాలు హైదరాబాద్లోనే ఉండిపోయాయని అన్నారు.