బ్రిటన్లో కాలేజీల అడ్మిషన్ సీజన్ కావడంతో లండన్కు వెళ్లే విమాన టికెట్ల ధరలను ఆయా విమానయాన సంస్థలు భారీగా పెంచేశాయంటూ ఫిర్యాదులు వస్తున్ననేపథ్యంలోడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్ ధరల కోసం సంబంధిత ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్లోనే చూసుకోవాలని సూచించింది. మెటా సెర్చ్ ఇంజిన్లలో వాస్తవమైన ధరలు ఉండకపోవచ్చని పేర్కొంది.
ఢిల్లీ-లండన్ మార్గంలో బ్రిటిష్ ఎయిర్వేస్ టికెట్ ధర ఆగస్టు 26వ తేదీకి రూ.3.95 లక్షలు పలుకుతోందని కేంద్ర హోంశాఖ ఇంటర్స్టేట్ కౌన్సిల్ సెక్రెటేరియట్ సెక్రెటరీ సంజీవ్ గుప్తా ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పౌరవిమానయాన శాఖ స్పందిస్తూ ఆగస్టు నెలలో ఢిల్లీ-లండన్ మధ్య ఎకానమి క్లాస్ టికెట్ ధర రూ. 1.03లక్షల నుంచి రూ. 1.47లక్షలు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే గూగుల్ వంటి మెటా సెర్చ్ ఇంజిన్లలో ఒక్కోసారి ఎయిర్లైన్ వెబ్సైట్లలో ఉండే ధరల కంటే ఎక్కువ ధరలు చూపిస్తున్నాయని, దీనివల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
విదేశాలకు వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్ ధరల కోసం సంబంధిత ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్లలోనే చెక్ చేసుకోవాలని సూచించింది. ఎందుకంటే ఒక్కోసారి మెటా సెర్చ్ ఇంజిన్లు వాస్తవమైన పాయింట్ టు పాయింట్ టికెట్ ధరలను చూపించకపోవచ్చని, వాటిల్లో ఎయిర్లైన్ కాంబినేషన్లు కూడా ఉంటాయని, వీటివల్ల చివరకు అధిక ధరలు కన్పిస్తాయని డీజీసీఏ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
మరోవైపు టికెట్ ధరలకు సంబంధించి విమానయాన సంస్థలకు కూడా డీజీసీఏ పలు ఆదేశాలు జారీ చేసింది. మెటా సెర్చ్ ఇంజిన్లలో విమాన టికెట్ ధరలు ఎయిర్లైన్స్వెబ్సైట్లలో కంటే ఎక్కువ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అధిక డిమాండ్ వల్ల కొన్ని కీలక అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలు గత నెల రోజుల వ్యవధిలో గణనీయంగా పెరిగాయి. సర్వీసులు సరిపడా లేకపోవడంతో పాటు విమాన ఇంధన ధరలు పెరగడంతో సదరు సంస్థలు టికెట్ ధరలను పెంచేశాయి.