టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి రైతుల ఆందోళనకు సంఘీభావంగా దేవినేని గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు తరలివచ్చారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనలకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు దేవినేని ఉమను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. దీంతో గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.