ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. ‘ఉచిత్ విద్యుత్ పథకం-నగదు బదిలీ’ విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. విద్యుత్ ను ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే ప్రతి పంపుసెట్టుకు మీటర్ బిగించారని ఆరోపించారు.
ఒక్కో డివిజన్ ఒక్కోప్రైవేటు సంస్థకు బిల్లుల వసూలు బాధ్యత అప్పగించనున్నారని దుయ్యబట్టారు. దీంతో సబ్సిడీలు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. కరెంటును ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే మీటర్ల బిగింపంటున్న రైతుల ఆందోళనకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఉన్న 18 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లతో పాటు మరో లక్ష అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించి వాటిని ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం కిందికి తీసుకురానున్నట్లు ఆ పత్రికల్లో పేర్కొన్నారు.