టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం ఉదయం వైసీపీ అధినేత జగన్తో చంద్రశేఖర్ భేటీ అయ్యారు. వైసీపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ ప్రసాద్ దగ్గరుండి దేవినేని చంద్రశేఖర్ను లోటస్పాండ్కు తీసుకెళ్లారు. విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభలో దేవినేని వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అనంతరం దేవినేని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో వైసీపీని అధిక మెజారిటీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో అవినీతి పెరిగిపోయిందని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. కేసుల నుంచి తెలుగుదేశం నేతలు తప్పించుకోలేరని ఆయన చెప్పుకొచ్చారు. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి దేవినేని పోటీచేస్తారని ఇప్పటికే టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.