మహారాష్ట్రలో నెలరోజులుగా సాగుతున్న రాజకీయ అనిచ్ఛితికి ఎట్టకేలకు తెరపడింది. సీఎం పదవి కోసం ప్రత్యర్థి పార్టీలతో జత కట్టిన శివసేనకు బీజేపీ భారీ షాక్ ఇచ్చింది. మరికొద్ది గంటల్లో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందనగా… ఏకంగా ఆ పార్టీ చేతులు కలిపిన ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగమేఘాల మీద శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఇవాళ ఉదయం రాజ్భవన్లో ఫడ్నవీస్, అజిత్ పవార్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీని ఇచ్చారన్నారు. కానీ ఫలితాల తర్వాత ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు శివసేన ప్రయత్నించిందని ఆరోపించారు. దాని వల్లే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించామన్నారు. మహారాష్ట్రకు ‘‘కిచిడీ సర్కారు’’ అక్కర్లేదనీ, సుస్థిర ప్రభుత్వమే కావాలని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.