ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ఢిల్లీ మన రాజధాని అని, మనందరి ఆత్మగౌరవం అని ఉద్ఘాటించారు.
“మన దేశానికి వచ్చే విదేశీయులు ముందుగా వచ్చేది ఢిల్లీకే. గత పదేళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ప్రపంచంలోనే అత్యధిక వెదర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఉంది. చేసిన పనులు ఫలితాలు ఇవ్వకపోవడంతో కేజ్రీవాల్ ఏవేవో చెప్పి ప్రజల్ని పొల్యూట్ (కలుషితం) చేయాలని చూస్తున్నారు.
ఢిల్లీ గల్లీల్లో మురికినీరు, మంచినీరు కలిసిపోవడంతో ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోంది అదే మైనస్. యమునా నది మొత్తంగా కలుషితమైంది.
వాయు కాలుష్యం అయితే భరించలేని స్థితిలో ఉంది. ఢిల్లీకి ఎవరూ వచ్చేందుకు ఇష్టపడటం లేదు. బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం కనుక ప్రజలు ఆలోచన చేయాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.