నటగురువు దేవదాస్ కనకాల శుక్రవారం సాయంత్రం మరణించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కొద్ది సేపటి క్రితం ఆయన మృతదేహాన్ని కిమ్స్ నుండి మణికొండలోని స్వగృహానికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన అంతిమసంస్కారాలు జరగనున్నాయి. అంతిమ సంస్కారాలలో పాల్గొనేందుకు పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు, శిష్యులు కూడా భారీగా తరలిరానున్నారు.
1945 జూలై 30న యానాం సమీపంలోని కనకాలపేటలో దేవదాస్ జన్మించారు. రజినీకాంత్, చిరంజీవితో పాటు రాజేంద్రప్రసాద్, భానుచందర్, శుభలేఖసుధాకర్, రాంకీ, అరుణ్పాండ్యన్, నాజర్, రఘువరన్..ఇలా ఎంతో మందిని ఉత్తమ నటులుగా తీర్చిదిద్దిన గురువుగా దేవదాస్ కనకాల పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి నటవారసత్వాన్ని కొనసాగించిన తనయుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మి నటులుగా రాణిస్తున్నారు. ఆయన కోడలు సుమ తెలుగునాట ప్రముఖ వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకుంది. గత ఏడాది ఆయన భార్య లక్ష్మి కన్నుమూయడంతో దేవదాస్ కనకాల కృంగిపోయారు.