telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెరపైకి దీపికా…!?

deepika

సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినీ తారల డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ మాఫియాతో వారి సంబంధాలపై కూపీ లాగుతున్నారు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు బయటకురావడం హాట్ టాపిక్ అయింది. ఎన్‌సీబీ అధికారులు సోమవారం రోజు టాలెంట్‌ మేజేజర్‌ జయా సాహాను విచారించగా స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చినట్లు ప్రముఖ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. జయ వాట్సాప్ చాట్ చేసిన దాన్ని బట్టి ఆమె దీపికా పర్సనల్ మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చర్చించిందని ఎన్‌సీబీ అధికారుల దృష్టికి వచ్చింది. అందులో ఉన్న కోడ్‌ భాషలో D అంటే దీపిక అని, K అంటే కరిష్మా అని అనుమానిస్తోంది ఎన్‌సీబీ అధికార బృందం. ఈ మేరకు ఇప్పటికే దీపికా మేనేజర్‌ కరిష్మాకు సమన్లు జారీ చేయడం జరిగింది. ఇక జయా సాహా ఇచ్చిన సమాచారాన్ని బట్టి నిర్మాత మధు మంతెనకు కూడా సమన్లు జారీ చేశారు. దీపిక పదుకొనే, శ్రద్ధాకపూర్‌లకు ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే హీరోయిన్లు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్, డిజైనర్‌ సిమోన్‌ ఖంబాటాలకు ఈ వారంలోనే సమన్లు జారీ చేయనున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే డ్రగ్స్ వాడినట్లు, డ్రగ్స్ పెడల్స్‌తో తనకు కాంటాక్ట్స్ ఉన్నట్లు ఒప్పుకున్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి.. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటపెట్టడం సెన్సేషన్ కాగా, ఇప్పుడు దీపిక పేరు కూడా బయటకురావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక సుశాంత్ అనుమానాస్పద మృతి కేసు విచారణలో భాగంగా ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు షాకిస్తున్నాయి. నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్, డ్రగ్స్ రాకెట్ లాంటి ఎన్నో అంశాలు తెరపైకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ డ్రగ్స్ రాకెట్ లో ఇంకెంతమంది స్టార్ల పేర్లు బయటకు వస్తాయో చూడాలి.

Related posts