కరోనా వైరస్ కారణంగా మరో 24 మంది మృతిచెందినట్లు చైనా ప్రకటించింది. దీంతో మొత్తం చైనాలో కరోనా మృతుల సంఖ్య 131కి చేరింది. 4,515 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. థాయ్లాండ్లో 7, జపాన్లో 3, దక్షిణ కొరియాలో 3, అమెరికాలో 3, వియత్నాంలో 2, సింగపూర్లో4, మలేషియాలో 3, ఫ్రాన్స్లో 3, ఆస్ట్రేలియాలో 4, శ్రీలంక, నేపాల్లో చెరో కేసు నమోదైనట్టు అధికారులు చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో భారత్కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు ఇప్పటికే 7 విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని 20 విమానాశ్రయాలకు విస్తరించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. భారత్లో ఒక్కవ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు.
చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని వూహాన్కి పంపనున్నట్టు చెప్పారు. అయితే అందుకు మరికొద్ది రోజులు పట్టొచ్చనీ, వారిని వెనక్కి తీసుకొచ్చి తీరుతామనీ, స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఒక్క భారతీయ విద్యార్థికి కూడా వైరస్ సోకలేదని చెప్పారు. చైనాలో చిక్కుకుపోయిన గుజరాత్కి చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు తాము భారత్ తిరిగివచ్చేందుకు యత్నిస్తున్నారు. అందులో కొందరు బీజింగ్ నుంచి బయలుదేరి బుధవారానికి దేశానికి చేరుకుంటారని గుజరాత్ సీఎం రూపానీ చెప్పారు. సురక్షితంగా దేశానికి చేర్చేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది.