telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కవితా’పయోనిధి… దాశరథి

Dasharathi

(నేడు దాశరథి కృష్మమాచార్యులు జయంతి – 22 జులై 1925.- 5 నవంబరు 1987)

తెలంగాణ విముక్తి కోసం తన కవితను ఆయుధంగా మలచి ఉద్యమించిన ‘సుకవి’ అతడు. నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజల అగచాట్లను, కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలచి పీడిత ప్రజల గొంతును వెలుగెత్తి నినదించిన ఉద్యమకారుడతడు. అందుకు ఆ నిరసనకారుడు ధారపోసిన కవితాధార ‘అగ్నిధార’. ‘‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే…ఓ… నిజాము పిశాచమా, కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని’’ అని గర్జిస్తూ ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ప్రకటించి విముక్తి ఉద్యమానికి ప్రేరణనిచ్చిన ప్రాతస్మరణీయుడతడు. ఇందూరు కోట జైలులో పండ్లు తోముకోవడానికి నిజాం సిబ్బంది ఇచ్చే బొగ్గులను ఆయుధాలుగా మలిచి, ‘దగాకోరు, బడాచోరు, రజాకారు పోషకుడవు. దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది. దిగిపోవోయ్‌, తెగిపోవోయ్‌’ అంటూ కవిత్వాన్ని వజ్రాయుధంగా వాడి, ఆ జైలు గోడలమీద నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పద్యాలు రాసి కొరడా దెబ్బలు తిన్న విప్లవకారుడతడు. భావప్రేరిత ప్రసంగాలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన ధీశాలి. తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు నేటికీ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నాయి. ఆ ధీమంతుడే ‘దాశరధి’ అని ప్రేమగా పిలిపించుకున్న దాశరథి కృష్ణమాచార్యులు. చలన చిత్రసీమలో కూడా దాశరథి తన మార్కు పాటల్ని రాసి ‘శభాష్‌’ అనిపించుకున్నారు. జూలై 22, 1925న వరంగల్‌ జిల్లా చిన్న గూడూరులో జన్మించిన దాశరథి 95వ జయంతి సందర్భంగా ఆ కవితా పయోనిధికి కితాబునిస్తూ, సంస్మరించు కుంటూ, ఆయనను గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం…

బాల్యం నుంచే విప్లవబాటలో…
దాశరథి కృష్ణమాచార్యుల బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. మెట్రిక్యులేషన్‌ పరీక్షను ఉర్దూ మీడియంలో చదివారు. తెలంగాణా విమోచనోద్యమం కారణంగా చదువు కుంటుపడడంతో 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయ సాయంకళాశాలలో చేరి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నారు. చిన్నతనం నుంచే పద్యాలు అల్లడంలో ప్రావీణ్యత సాధించారు. సంస్కృత, ఉర్దూ, పారశీక భాషల్లో దాశరథి దిట్ట. తొలి నుంచి వామపక్ష భావాలు కలిగిన దాశరథి, కమ్యూనిస్టు సిద్ధాంతాలు, వైఖరి నచ్చక రెండవ ప్రపంచ యుద్ధసమయంలో బయటకు వచ్చారు. సాయుధ రైతాంగ పోరాటానికి నడుం బిగించారు. మెట్రిక్యులేషన్‌ పూర్తవగానే కొంతకాలం ఉపాధ్యాయునిగా, పట్టా పుచ్చుకున్న తర్వాత పంచాయతీ తనిఖీ అధికారిగా పనిచేశారు. 1956 నుంచి 1963 వరకు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలోను, 1963 నుంచి 1971 వరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలోను, ప్రయోక్తగా ఉద్యోగం చేశారు. ఆంధ్రమహాసభలో విప్లవాత్మక సందేశాలు ఇచ్చినందుకు నిజాం ప్రభుత్వం 1948లో దాశరథిని జైలులో పెట్టింది. నిజామాబాదు ఇందూరుకోట జైలులో వున్నప్పుడు పండ్లు తోముకోవడానికి జైలు సిబ్బంది ఇచ్చే బొగ్గు ముక్కలతో ఆ జైలు గోడల నిండా నిజాంకు వ్యతిరేకంగా పద్యాలు రాసి కొరడాదెబ్బలు తిన్నారు. తర్వాత తెలంగాణా రచయితల సంఘాన్ని నెలకొల్పి యువతలో సాహితీ చైతన్యాన్ని రగిలించి కవితా సేవలు విస్తరింపజేశారు. ఆయన మంచి వక్త కావడంతో ఊరూరా పర్యటిస్తూ ప్రజలను ప్రభావితం చేశారు. దాశరథి రచించిన తొలి పుస్తకం ‘అగ్నిధార’ను 1949లో దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవంలో విడుదల చేశారు. నిజాం నిరంకుశత్వం, భారత స్వాతంత్య్ర సమరం, ప్రజల అగచాట్లు, నిజాం ప్రభుత్వ పతనం వంటి అంశాలు ‘అగ్నిధార’ ఖండికల రచనకు పునాదులని దాశరథి స్వయంగా చెప్పుకున్నారు. తర్వాత ‘రుద్రవీణ’, ‘మహా ఆంధ్రోద్యమం’, పునర్నవం’, ‘కవితా పుష్పకం’, ‘తిమిరంలో సమరం’ వంటి కవితాగ్రంధాలు వెలువరించారు. కథలు, నాటికలు కూడా రాశారు. 1965లో ‘గాలిబ్‌ గీతాలు’ రచనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వపు ఉత్తమ అనువాద గ్రంధ బహుమతి, 1967లో ‘కవితా పుష్పకం’ సంపుటికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 1974లో ‘తిమిరంలో సమరం’ రచనకు కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో, ఆగ్రా విశ్వవిద్యాలయం ‘డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ పట్టాతో దాశరథిని సత్కరించారు. 1977లో దాశరథి ఆంధ్రరాష్ట్ర ఆస్థాన కవిగా నియమితులయ్యారు.

సింహద్వారం గుండా సినీరంగానికి…
దాశరథి సినీరంగ ప్రవేశానికి ముందే ఎన్నో లలితగీతాలను రాసి ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయించారు. ‘నవమంజరి’ పేరుతో లలిత గీతాల సంపుటిని వెలువరించారు. దాశరథికి సూఫీ కవిత్వమంటే ప్రత్యేక అభిమానం. ఆ కోవలోనే 1960లో మీర్జా గాలిబ్‌ ఉర్దూ గజళ్ళను ‘గాలిబ్‌ గీతాలు’ పేరుతో క్లుప్తత చెడకుండా రెండు పాదాలలోనే గాలిబ్‌ భావాలను విశదీకరిస్తూ అనువదించారు. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు అంకితమిచ్చారు. ఆనాటి సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. దాశరథి రాసిన గాలిబ్‌ గీతాలను దుక్కిపాటి మధుసూదనరావు చదవడం జరిగింది. దాశరథి రచనా శైలి ఆయనను ఆకట్టుకుంది. దాశరథికి ప్రత్యుపకారం చేయనెంచి సినిమాల్లో పాటలు రాయమని అక్కినేని, దుక్కిపాటి మధుసూదనరావు ఇద్దరూ కోరారు. తనకు సినిమా సంగీత పరిజ్ఞానం లేదని దాశరథి సమాధానమివ్వడంతో, మధుసూదనరావు ‘‘అదేమీ పెద్ద విషయం కాదు. మీరు సరేనంటే అంటా మేము చూసుకుంటాం’’ అన్నారు. దాశరథి అందుకు సరేనంటూ మద్రాసుకు ప్రయాణం కట్టారు. అక్కడ సాలూరు రాజేశ్వరరావు కొన్ని ట్యూనులు వినిపించి ‘‘మీరు ట్యూనుకు పాట రాస్తారా, లేక ముందు పాట రాస్తే నేను బాణీ కట్టనా’’ అని దాశరథిని అడిగారు. దాశరథి రాజేశ్వరరావుకే అవకాశమిస్తూ ‘‘ట్యూను ఇవ్వండి. పాట రాసేందుకు ప్రయత్నం చేస్తాను’’ అని వినయంగా చెప్పారు. రాజేశ్వరరావు ఒక ట్యూను వినిపించి పాట రాయమని దాశరథికి చెప్పి తాంబూల చర్వణం కోసం బయటకు వెళ్లి మరో పది నిమిషాల్లో తిరిగి వచ్చారు. అప్పటికే పాట రాసిన దాశరథి, కాగితాన్ని రాజేశ్వరరావు చేతిలో పెట్టారు. రాజేశ్వరరావు ఆశ్చర్యపోతూ ఆ పాట సాహిత్యాన్ని హార్మోనియం మీద పలికిస్తూ, రాగాలాపన చేసి సరిచూసుకుంటే బాణీకి అతికినట్లు సరిపోయింది. వెంటనే చరణాలకు బాణీ చెప్పి దాశరథి వాటిని రాసే లోపల నిర్మాత మధుసూదనరావు వద్దకు వెళ్లి ‘‘సార్‌… ఈ రచయిత అఖండుడండీ. నేను వారికి ఇచ్చింది చాలా కఠినమైన ట్యూను. ‘ది కింగ్‌ స్టన్‌ ట్రయో’ ఆలపించిన ‘హ్యాంగ్‌ డవున్‌ యువర్‌ హెడ్‌ టామ్‌ డూలీ’ పాట ఆధారంగా ఇచ్చిన ట్యూనది. అవలీలగా పదినిమిషాల్లోనే ఆ ట్యూనుకి పల్లవి రాసిచ్చారు. ట్యూనుకు అతికినట్లు సరిపోయింది’’ అని రాజేశ్వరరావు ప్రశంసల వర్షం కురిపించారు. చరణాలు కూడా అద్భుతంగా అమరాయి. అదే ‘‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ, హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా’’ అంటూ ఉర్దూ పదాల మేలవింపుతో దాశరథి రాసిన తొలి పాట. ఈ పాటను ఊటీలో చిత్రీకరించేటప్పుడు అక్కినేని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని పాట బ్యాక్‌ గ్రౌండ్‌ సంగీతానికి అనుగుణంగా కాళ్లు కదిలించేలా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. పైగా ‘‘చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలసిపోదామా హాయిగా, నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా’’ అనే చరణాన్ని మాత్రం ఇండోర్లో చిత్రీకరించారు. అవుట్‌ డోర్‌ షాట్‌కు ఇన్‌ డోర్‌ షాట్‌కు ఎక్కడా తేడా కనిపించకుండా చిత్రీకరించడం ఈ పాట గొప్పతనం. అందుకే దాశరథి రాసిన తొలి పాటే సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఉర్దూ భాషలో దాశరథికి మంచి ప్రవేశం వుండడం, ఖవ్వాలీ పాటల తీరుతెన్నులు బాగా తెలిసి ఉండడంతో, దాశరథి చేత ఒక ఖవ్వాలీ పాటను కూడా రాయిస్తే సినిమాలో కొత్తదనం కనిపిస్తుందని దాశరథి చేత ‘‘నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి’’ అంటూ ఖవ్వాలి ప్రాసలో పాట రాయించారు దుక్కిపాటి. ఈ పాట కూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నదే! ‘ఇద్దరుమిత్రులు’ సినిమా నిర్మాణ సమయంలోనే ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో ‘వాగ్దానం’ సినిమా రూపుదిద్దు కుంటోంది. దాశరథిని ఆత్రేయ ఆహ్వానించి ఒక పాట రాసిపెట్టమన్నారు. సంగీత దర్శకుడు పెండ్యాల దర్శకనిర్మాత వి.శాంతారాం నిర్మించిన ‘నవరంగ్‌’ సినిమాలో ‘ఆదా హై చంద్రమా రాత్‌ ఆధీ’ అనే పాట ట్యూనుని రేఖామాత్రంగా సూచిస్తూ దాశరథిని పాట రాయమంటే ‘నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా’ అంటూ అద్భుతంగా రాసి ఇచ్చారు. ముఖ్యంగా ఈ పాటలో దాశరథి ‘‘ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో, జాబిలి వెలిగెను మనకోసమే’’, ‘‘చŸందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా’’, ‘‘అందాలను, తీపి బంధాలను, అల్లుకొందాము డెందాలు పాలించగా’’ వంటి అద్భుత పద ప్రయోగాలు చేశారు. ఈ పాటను అక్కినేని, కృష్ణకుమారిల మీద డ్రీం సాంగ్‌గా చిత్రీకరించారు. దాశరథి తొలిపాటను ‘ఇద్దరుమిత్రులు’ సినిమా కోసం రాసినా, ‘వాగ్దానం’ సినిమా ముందుగా 05-10-1961న విడుదలైంది. ‘ఇద్దరుమిత్రులు’ సినిమా కాస్త ఆలస్యంగా 29-12-1961 న విడుదలైంది. రికార్డు విడుదల ప్రకారం తీసుకుంటే దాశరథి రాసిన తొలి తెలుగు పాట ‘ఇద్దరుమిత్రులు’ సినిమాలోని ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’గానే పరిగణించాలి.

దాశరథి రచించిన వైవిధ్య గీతాలు
దాశరథి ఎన్నో భక్తిగీతాలను సినిమాల కోసం రాశారు. ఆ పాటలన్నీ శ్రోతలు మెచ్చినవే. ‘తిరుమల మందిర సుందరా’ (మేనకోడలు), ‘నను పాలింపగ నడచీ వచ్చితివా’ (బుద్ధిమంతుడు), ‘శరణం నీ దివ్య చరణం’ (మట్టిలో మాణిక్యం), ‘నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో’ (రంగులరాట్నం), ‘రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా’ (రాము) పాటలు దాశరథి రాసిన భక్తి పాటల్లో కొన్ని. రక్తి పాటలను కూడా దాశరథి అద్భుతంగా ఆవిష్కరించారు. వాటిలో కొన్ని ‘తనివి తీరలేదే నా మనసు నిండలేదే’ (గూడుపుఠాణి), ‘వెన్నెలరేయి ఎంతో చలీ చలీ’ (ప్రేమించిచూడు), ‘ఓ చెలీ కోపమా అంతలో తాపమా’ (శ్రీకృష్ణ తులాభారము), ‘విన్నవించుకోనా చిన్న కోరికా’ (బంగారు గాజులు), ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ (నోము), ‘ఈవేళ నాలో ఎందుకో ఆశలు’ (మూగనోము), ‘ఒక పూలబాణం తగిలింది మదిలో’ (ఆత్మగౌరవం), ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే’ (తోటరాముడు). వీణ పాటలంటే వెంటనే గుర్తుకొచ్చేది దాశరథి గీతాలే. వాటిలో కొన్ని ‘పాడెద నీ నామమే గోపాలా’ (అమాయకురాలు), ‘వేణుగానలోలునిగన వేయి కనులు చాలవులే’ (రెండు కుటుంబాల కథ), ‘నేనె రాధనోయి గోపాలా’ (అంతా మనమంచికే), ‘మ్రోగింది వీణా పదేపదే హృదయాల లోనా’ (జమీందారుగారి అమ్మాయి), ‘మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే’ (ఆత్మీయులు). అలాగే దాశరథి రాసిన ఖవ్వాలీ పాటలు కూడా జనరంజకాలే. ‘నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే ఇవ్వాలి’ (ఇద్దరుమిత్రులు), ‘అందాల ఈ రేయి రాదోయి రాదోయి’ (లేతమనసులు), ‘దీపాలు వెలిగే పరదాలు తొలగే’ (పునర్జన్మ) పాటలు ఆ కోవలోనివే. కొన్ని మంచి ఆవేదనా పూరిత గీతాలను కూడా దాశరథి రాసి హిట్‌ చేశారు. వాటిలో ‘మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనమూ నీకేలా’ (రాము), ‘కన్నయ్యా నల్లని కన్నయ్యా’ (నాదీ ఆడజన్మే), ‘నీవురావు నిదుర రాదు నిలిచిపోయె ఈ రేయి’ (పూలరంగడు), ‘బాబూ వినరా అన్నాతమ్ములా కథ ఒకటి’ (పండంటి కాపురం) మచ్చుకు కొన్ని మాత్రమే. మరికొన్ని మంచి పాటలను ఉదహరించాలంటే… ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ (ఆడపడుచు), ‘నన్ను వదలి నీవు పోలేవులే’ (మంచిమనసులు), ‘వినిపించని రాగాలే’ (చదువుకొన్న అమ్మాయిలు), ‘అందాల ఓ చిలుకా అందుకో నా లేఖా’ (లేతమనసులు), ‘రాశాను ప్రేమలేఖలెన్నో’ (శ్రీదేవి), ‘దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే’ (తేనెమనసులు), ‘అందాల బొమ్మతో ఆటాడవా’ (అమరశిల్పి జక్కన్న), ‘గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది’ (మూగమనసులు), ‘కిలకిల నగవుల నవమోహినీ ప్రియ కామినీ’ (వసంతసేన), ‘కనరాని దేవుడే కనిపించినాడే’ (రంగులరాట్నం). ఇలా చెప్పుకుంటూ పొతే దాశరథి రాసిని కొన్ని వందల పాటల్లో యేపాటను తీసివేయగలం! నంది పురస్కారాలు ప్రారంభించేనాటికే దాశరథి దాదాపు సినిమా పాటలు రాయడం మానివేయడంతో ఆ బహుమతులు దాశరథి అందుకోలేకపోయారు. నవంబరు 5, 1987 లో దాశరథి కన్నుమూశారు.

-ఆచారం షణ్ముఖాచారి

Related posts