డా. దాసరినారాయణరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.
కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది. దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.
ఇది ఇలా ఉండగా.. దాసరి నారాయణరావు జయంతి నేపథ్యంలో హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో దాసరి నారాయణరావుకు ఆయన అల్లుడు ప్రముఖ డయాబెటిక్ డాక్టర్ రఘునాథ్ బాబు నివాళులు అర్పించారు. దాసరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రఘునాథ్ బాబు. ఆ తర్వాత దాసరి నారాయణరావు ఫాంహౌస్ లో ఆయన కూతురు ఎం. హేమాలయకుమారి, రఘునాథ్ బాబు దాసరికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా దాసరి నారాయణరావు సేవలను వారు గుర్తు చేసుకున్నారు.