దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కుమారుడు తారక ప్రభు ఈ నెల 9 నుంచి కనిపించకుండా పోవడంతో, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. తన పెద్ద భార్య సుశీల, అత్తతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు భావిస్తున్న పోలీసులు, వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభు తన వద్ద సెల్ఫోన్ కూడా లేకుండా జాగ్రత్త పడడంతో లొకేషన్ తెలుసుకోవడం కష్టంగా మారింది.
9న అదృశ్యమైన ప్రభు తొలుత చిత్తూరు వెళ్లి అక్కడి నుంచి భార్య, అత్తను తీసుకుని తిరుపతి వెళ్లాడు. 12న మియాపూర్ వచ్చి అక్కడ రెండు రోజులు గడిపాడు. పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసిన ఆయన అక్కడి నుంచి కూడా వెళ్లిపోయాడు. వీరంతా ఎక్కడ ఉన్నారన్న విషయం మాత్రం పోలీసులకు మిస్టరీగా మారింది. త్వరలోనే వారిని పట్టుకుని తీరుతామని జూబ్లీహిల్స్ పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.