దాసరి తారక ప్రభు కొన్ని రోజులుగా అదృశ్యమై.. రాత్రి తన నివాసానికి చేరుకున్నాడు. ప్రభు అదృశ్యమైన తర్వాత ఆయన మామ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభును అదుపులోకి తీసుకుని విచారించినట్టు సమాచారం. ఒకప్పుడు ఎంతో మంది సమస్యలను తన తండ్రి దాసరి నారాయణరావు పరిష్కరించారని, తమ సమస్యలను మాత్రం సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోవట్లేదని, పోలీసులే తమకు న్యాయం చేయాలని ప్రభు కోరినట్టు తెలుస్తోంది.
తన తమ్ముడితో ఆస్తి వివాదాలు ఇంకా ఉన్నాయని, ఆస్తుల కోసం తన మొదటి భార్య తనను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతోందని ప్రభు ఆరోపించినట్టు తెలుస్తోంది. తన మొదటి భార్యతో ఉన్న సమస్య పరిష్కారం నిమిత్తం ఆమె దగ్గరకు వెళ్లానని, తన నుంచి బంగారం, విలువైన వస్తువులను ఆమె లాక్కుందని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రభు చెప్పారట. తన మొదటి భార్య తనను వారం పాటు చిత్తూరు, ముంబై, హైదరాబాద్ కు తిప్పిందని, ఇలాంటి పరిస్థితిలో ఉన్న తనకు దిక్కుతోచడం లేదని ప్రభు తన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.