telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి

Dasharadhi

తెలంగాణలో జన్మించిన , గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు.“ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్ బడగొట్టి, మంచి మాగాణములన్ సృజించి, ఎముకల్ నుసిచేసి, పొలాలు దున్ని, భోషాణములన్ నవాబుకు స్వర్ణము నిండిన రైతుదే తెలంగాణము రైతుదే; ముసలి నక్కకు రాజరికంబు దక్కునే” – అంటూ గర్జించి, హైదరాబాద్ సంస్థాన విముక్తి మహెూద్యమంలో దూకి, నిజాం నవాబు అలీఖాన్ ను ఎదిరించి, తెలంగాణ విముక్తికై కారాగార శిక్ష అనుభవించి, లక్ష్యాన్ని సాధించిన స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి.
దాశరథి పూర్తి పేరు – దాశరథి కృష్ణమాచారి. దాశరథి 1925 జూలై 22 నాడు, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా, చినగూడూరు గ్రామంలో జన్మించినాడు. శ్రీమతి వేంకటమ్మ, శ్రీమాన్ వేంకటాచార్యులు ఆతని తల్లిదండ్రులు. దాశరథి రంగాచారి దాశరథి తమ్ముడు. తండ్రి నుండి, చిన్ననాడే సంస్కృత భాషా సాహిత్యాలను, తల్లి నుండి తెలుగు పరిమళాలనూ మానవతా దృక్పథాన్నీ సంగ్రహించి నాడు దాశరథి .
చినగూడూరులో నాల్గవ తరగతినీ, ఖమ్మం ఉస్మానియా హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ నూ పూర్తి చేసినాడు. ఖమ్మంలో చదువు కుంటున్నప్పుడే మీర్జాగాలిబ్ శృంగారాత్మక సాహిత్యాన్ని,ఇక్బాల్ విప్లవ గీతాలను అధ్యయనం చేసినాడు. మరోవైపు ఉపనిషత్తుల సారాన్ని ఎదలో పొదుగుకొన్నాడు దాశరథి .
“నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనొ అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను” – అంటూ విప్లవ చైతన్య మూర్తియై ప్రజ్వరిల్లినాడు. ప్రజల బాధలకు,కారణభూతులైన భూస్వాముల ఆటకట్టించాలనీ, రైతుల హక్కుల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులతో కలిసిపోయినాడు దాశరథి. కార్యకర్తగా, కావ్యకర్తగా ఉద్యమించాడు. కోయగూడేలలో తిరిగి వాళ్లను సమైక్య పరచినాడు. లంబాడీలను, హరిజనులను, రైతులను, కూలీలను, వర్తకులను మేల్కొలిపి, వాళ్లను స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములుగా చేసినాడు. పుంఖానుపుంఖంగా కవితలు రచించి, పీడిత ప్రజల, భావాలకు ప్రతినిధిగా తన కలాన్ని ఝళిపించినాడు.
తెలుగు భాషా సంస్కృతుల పునరుద్ధరణకై కంకణం కట్టుకొన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలలో పాల్గొని, కావ్యగానం చేసేవాడు దాశరథి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవ సభ 1944 లో ఓరుగల్లు కోటలో ఏర్పాటైంది. రజాకార్లు సభపై – వేసిన పచ్చని పందిళ్లను తగులబెట్టినారు . అప్పుడు దాశరథి నిర్భయంగా- “ జ్వాలలో ఆహుతి అయిపోతాం గాని, కవి సమ్మేళనం జరిపి తీరుతాం ” అంటూ కాలిన పందిళ్ల బూడిద వేడిగా కాళ్లకు తగులుతుండగా , గళం విప్పి –

“ఓ పరాధీన మానవా! ఓపరాని
దాస్యము విదల్చలేని శాంతమ్ముమాని
తలుపులను ముష్టిబంధాన కలచివైచి
చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర్య సురపురమ్ము” – అంటూ ప్రబోధించినారు. సభాధ్యక్షులైన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు లేచి ‘సింహగర్జన చేశావు నాయనా’ అంటూ దాశరథిని మెచ్చుకొన్నారు. శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు దాశరథి మెడలో పుష్పహారం వేసి కౌగలించుకొన్నారు.తరువాత ‘మంచిర్యాల’లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభా కవి సమ్మేళనానికి, దాశరథి అధ్యక్షత వహించి ప్రజలను ప్రబోధించినారు .
1945-46 ప్రాంతంలో దాశరథికి కమ్యూనిస్ట్ లతో అభిప్రాయ భేదాలేర్పడ్డాయి. అప్పుడు దాశరథి హైదరాబాదు సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనకూ,భారత యూనియన్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడానికీ, మహెూద్యమాన్ని సాగిస్తున్న ‘ స్టేట్ కాంగ్రెసు’ లో చేరినారు. స్వామీ రామానందతీర్థ నాయకత్వంలో, జమాలాపురం కేశవరావు, కొండా వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగువారితో కలసి, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు దాశరథి .
“ఇదేమాట ఇదేమాట పదేపదే అనేస్తాను” అంటూ, “నిజాం రాజు జన్మజన్మల బూజు” అంటూ, ఉద్యమ కవితావేశ మూర్తియై, దాశరథి సత్యాగ్రహానికి తలపడ్డారు. అప్పటి దాకా పొంచి ఉన్న పోలీసులు
‘గార్ల ‘ గ్రామంలో, దాశరథిని అరెస్టు చేసి, నిజాం ప్రభుత్వం దాశరథికి 16 నెలల కఠిన కారాగార శిక్షను విధించింది. కొన్ని నెలలు వరంగల్ జైల్లో ఉంచి, తరువాత దాశరథిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు పంపింది. నిజామాబాద్ జైల్లో దాశరథి ముఖం కడుక్కునే బొగ్గుతో జైలు గోడ మీద –
“ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన
రాజుకు మాకెన్నటేని తీగెలను తెంపి
అగ్నిలో దింపినావు నాతెలంగాణ కోటి రత్నాల వీణ ” అని రాస్తే జైలు అధికారులు తుడిచివేసినారు. అపుడు అదే జైల్లో ఉన్న త్యాగమూర్తి శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి గారు,ఆ పద్యాన్ని మళ్లీ మళ్లీ గోడ మీద రాసేవారు. జైల్లో దాశరథి స్వామి రామానంద తీర్థను దర్శించుకొన్నారు. స్వామీజీ దాశరథి సాహసాన్ని ప్రశంసించినారు .
నిజాం, భారత యూనియన్ తో కుదుర్చుకొన్న ఒడంబడికను ఉల్లంఘించిన ఫలితంగా ‘పోలీసు చర్య’ జరిగింది. భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13 నాడు హైదరాబాద్ లోనికి చొచ్చుకొని వచ్చింది. సెప్టెంబర్ 17 నాడు నిజాం లొంగిపోయినాడు. హైదరాబాద్ సంస్థానం విముక్తమైంది. దాశరథి జైలు నుండి విముక్తుడైనాడు.తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడైన దాశరథి లక్ష్యం నెరవేరింది. ‘రుద్రవీణ ‘ కావ్యాన్ని ‘ తెలంగాణ’ కు అంకితం చేసి జన్మభూమి ఋణం తీర్చుకొన్నారు దాశరథి.

“నా తెలంగాణ తల్లి కంజాతవల్లి” – “నా తెలంగాణ కోటి అందాలజాణ” – “నా తెలంగాణ సీమ సౌందర్యసీమ”- “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ తెలంగాణ తల్లిని వేనోళ్లా ప్రశంసించిన తెలంగాణ ముద్దు బిడ్డడు దాశరథి.
“తెలంగాణలోని కోటి ధీరుల గళధ్వనినె గాక ఇలా గోళ మందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి” అని చాట గలగిన ప్రపంచ ప్రజాకవి దాశరథి.
“అగ్నిధార” మొదలు ‘ నేత్రపర్వం ‘ దాకా ముప్పైకి పైగా, గ్రంథాలు రచించినారు దాశరథి. 200 కు పైగా చలన చిత్రగీతాలు రాసినారు. దాశరథిని గూర్చి అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగినవి. ఆతని రచనలు అనేక భాషలలోనికి అనువాదితమైనాయి. తెలుగులో గజల్ రుబాయీ ప్రక్రియలను, ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన ప్రయోక్త దాశరథి మహాకవే .
‘జాతీయోద్యమ రథసారథిగా’ భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్రపత్ర సన్మానాన్నీ, అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ ఆర్. వెంకట్రామన్ గారి చేతుల మీదుగా సన్మానాన్ని అందుకొన్నాడు దాశరధి. ‘కళాప్రపూర్ణ’, ‘డి.లిట్’ వంటి గౌరవ పట్టాలతో వివిధ విశ్వవిద్యాలయాలు దాశరథిని సన్మానించినవి. అమెరికా తెలుగు వాళ్లు ‘ ఆంధ్ర కవితా సారథి’ గా సన్మానించారు .
ఒంగోలు ‘ గండపెండేరం ‘ తొడిగి సన్మానించింది. వరంగల్లు దాశరథికి స్వర్ణోత్సవం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977 లో ఆస్థానకవిగా నియమించి సన్మానించింది. అనేక దేశాలలో పర్యటించి , దాశరథి తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను గూర్చి ప్రసంగించినారు. 1983 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్థానకవి పదవిని రద్దు చేయడంతో దాశరథి కలతపడ్డారు. ఆ కలత అనారోగ్యానికి దారి తీసింది. 1987 నవంబరు 5 వ తేదీ నాడు ఉదయం 11 గం.లకు శాశ్వతంగా కన్నుమూసినారు దాశరథి.
బ్రతికినంత కాలం అవిశ్రాంతంగా తిమిరంతో సమరం జరిపిన, దాశరథి హఠాన్మరణానికి సాహిత్యలోకం స్వాతంత్ర్య సమరయోధుల సంఘం కన్నీరుమున్నీరుగా విలపించి నివాళులర్పించింది.
“నల్లని చీకట్ల మీద నవకాంతి కవితలు ” రాసిన దాశరథి “ జ్వాలా లేఖిని ఆరిపోదు”- “అందులోని చైతన్యమడీ పంకం ఇంకిపోదు ” కాలాన్ని గెలిచిన ఘన విజేత దాశరథి.
“తెలంగాణ వైతాళిక కవినేత దాశరథి”
(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం,భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “తెలంగాణ తేజోమూర్తులు” గ్రంధం నుంచి)

Related posts