తరువాత ఎన్నికలకు ఇప్పటి నుండే ఆకర్ష్ ప్రారంభించింది బీజేపీ. ఇప్పటికే అనేక మంది ఆ పార్టీ వైపు చుస్తూండటం విశేషం. ఇక తాజాగా, ఉత్తరాదిలో ఎంతో క్రేజ్ ఉన్న సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి బీజేపీలో చేరారు. బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు మనోజ్ తివారీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ లాల్ తదితరులు హాజరయ్యారు.
సప్నా చౌదరి లోక్ సభ ఎన్నికల సందర్భంగా మనోజ్ తివారీ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనోజ్ తివారీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. సప్నా చౌదరి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ప్రియాంకాగాంధీతో కలసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసింది. ఆ వ్యాఖ్యలను ఆమె కొట్టిపారేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి… తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించారు.