ఏపీ సీఎం చంద్రబాబు పై ఆయన తోడల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట అని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా చంద్రబాబుపై సోషల్ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే… ఆయనపై జాలేస్తోందన్నారు. నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి అని ఆరోపించారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు.
రాజధాని భూములను ఒక్కొక్కరికీ ఒక్కో రేటుకు ధారాదత్తం చేశారు. గ్రాఫిక్స్తోనే డిజైన్లు చూపుతూ కాలం గడుపుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని విమర్శించారు. రామాయపట్నం పోర్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేమే చేస్తామని ఇప్పుడు చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను ఆయన భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు.