బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ఈ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. సాయంత్రానికి అది మరింత తీవ్రం కానున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.ఇది సోమవారానికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉండకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన తుపాను తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈశాన్యం వైపునకు దిశ మార్చుకునేందుకు అనువైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో ఈదురుగాలులతో వర్షం పడతుందని, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది.మచిలీపట్టణానికి 1690 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని ట్రింకోమలికి 1060 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 1410 కిలోమీట్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఈ ఉదయం అది తీవ్ర వాయుగుండంగా మారి, 5:30 గంటల ప్రాంతంలో తుపానుగా మారినట్టు తెలిపారు. 29న అది తీవ్ర తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో 30న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.