ఎన్నికల సందర్భంగా అందరూ ఓటు వేసేందుకు ఎంత ఉత్సాహంతో ఉన్నారో ఈ విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. తాజాగా, టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఎన్నికల్లో తమకోసం నిబంధనలు సవరించాలంటున్నాడు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేశాడు. ఐపీఎల్ కారణంగా తాము పోలింగ్ సమయానికి స్వస్థలాల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని, అందుకే తమకు ఎక్కడినుంచైనా ఓటు వేసే సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.
పోలింగ్ వేళకు తాము ఎక్కడుంటే అక్కడే ఓటు వేసేలా అవకాశం ఇవ్వాలని కోరాడు. సాధారణంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఓటరు తన స్వస్థలంలోనే ఓటు వేయాలి. కొన్ని సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. అయితే, తాము కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నామని, నిబంధనల్లో మార్పు తెస్తే క్రికెటర్లు కూడా ఓటు వేసేందుకు వీలు కలుగుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.