ఏపీ రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రజలపై విశ్వాసం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అమరావతి రాజధాని అంశంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామాకు సిద్ధమని ప్రకటించారని తెలిపారు.
మంత్రులు బొత్స, అనిల్ కుమార్లు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పారు. రాష్ట్ర రాజధాని అంశమనేది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పిన వైఎస్సార్సీపీ ఇప్పుడు 3 రాజధానులంటూ మాట మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు.