మే 31వ తేదీన బ్యాంక్ సిబ్బంది తప్పిదం వల్ల పెన్సిల్వేనియాకు చెందిన రాబర్ట్ విలియమ్సన్, టిపానీ విలియమ్సన్ దంపతుల ఖాతాలోకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.85 లక్షల 96వేలు వచ్చిపడ్డాయి. వేరే వాళ్ల ఖాతాలోకి బదిలీ చేయాల్సిన నగదు పొరపాటున విలియమ్సన్ దంపతుల ఖాతాలోకి చేరింది. ఇక తమ ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమా కావడం చూసిన దంపతులు ఆ సొమ్మును దుబారాగా ఖర్చు చేయడం మొదలెట్టారు. పెండింగ్లో ఉన్న ఇంటి పాత బిల్లులు చెల్లించారు. రెండు కార్లు కొన్నారు. అలాగే రూ. 10 లక్షల 75వేలు స్నేహితులకు ఇచ్చారు. ఇలా రెండు వారాల్లోనే ఏకంగా రూ. 71లక్షల 59వేలు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో జూన్ 20న దంపతులను బ్యాంక్ అధికారులు సంప్రదించగా తాము బిజీగా ఉన్నామని, అది కూడా స్థానికంగా లేమంటూ బుకాయించారు. పొరపాటున వేరే వాళ్ల ఖాతాలోకి జమా కావాల్సిన నగదు మీ ఖాతాలోకి వచ్చిందని, దానిని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పిన విలియమ్సన్ దంపతులు పెడచెవిన పెట్టారు. మొదట రెండు మూడు సార్లు అధికారుల కాల్స్కు బాగానే స్పందించిన దంపతులు ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చేసి పత్తా లేకుండా పోయారు. దాంతో అధికారులు చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విలియమ్సన్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై దొంగతనం, పొరపాటు వచ్చిన ఇతరుల సొమ్మును వినియోగించడం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
previous post
next post