భారత్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ బబుల్లో ఉన్న ఆటగాళ్లు భయాందోళనకు గురవుతున్నారు. పైగా ప్రపంచ దేశాలు భారత్ను రెడ్ లిస్ట్ పెట్టడంతో పాటు ఫ్లైట్స్ బంద్ చేయడం, తగ్గించడం చేస్తుండటంతో స్వదేశాలకు ఎలా వెళ్లడమనే ఆందోళన ఆటగాళ్లలో నెలకొంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్లేయర్ ఆండ్రూ టై, లివింగ్ స్టోన్స్, ఆర్సీబీ ప్లేయర్ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్లు ఐపీఎల్ను వీడారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేసర్ కౌల్టర్నైల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రతీ ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. వారికుండే పరిస్థితుల్ని బట్టే వారి నిర్ణయాలు ఉంటాయి. ఆడమ్ జంపా తిరిగి స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్దపడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపై రిచర్డ్సన్ ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. వారితో మాట్లాడితే విషయం అర్థమవుతుంది. నేను జంపాతో మాట్లాడాను. వెళ్లాల్సిన పరిస్థితుల్లో తప్పక వెళ్లాల్సి వస్తుందన్నాడు. జంపా, రిచర్డ్సన్ నిర్ణయాలను గౌరవిస్తున్నా. నాకైతే బయోబబుల్ వాతావరణం బాగుంది. ఇంటికి వెళ్లడం కంటే ఇక్కడే సేఫ్ అనిపిస్తోంది’ అని తెలిపాడు.
previous post
next post