కరోనా దెబ్బకు దేశంలోని అన్ని రంగాలూ తీవ్రంగా నష్టపోయాయి. ఇక దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు రెండోదశ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే కరోనా కారణంగా టాలీవుడ్తో పాటు మిగతా ఇండస్ట్రీస్కు సంబంధించి సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అంతేకాకుండా థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్లు కూడా మూతపడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ తర్వాత అయినా థియేటర్స్ ఓపెన్ అవుతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా ప్రభావం కారణంగా చిత్ర పరిశ్రమలన్నీ కూడా దాదాపు 3 వేల కోట్ల మేరకు నష్టాలు చవి చూసినట్లు అంచనా. ఒకవేళ లాక్ డౌన్ తర్వాత కొన్ని ఆంక్షలతో థియేటర్లు తెరిచినా.. ప్రజలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ తర్వాత ప్రజలు థియేటర్ల వైపు రావడానికి మల్టీప్లెక్స్ నిర్వాహకులు మనిషికి, మనిషికి మధ్య మూడు సీట్లు గ్యాప్ ఉండే విధంగా సిట్టింగ్ సిస్టం మారుస్తారని సమాచారం. అంతేకాక సింగల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు కేవలం 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలనే కొత్త నిబంధనను తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇలా సీట్ల సంఖ్య తగ్గించి టికెట్ల రేట్లు పెంచితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అప్పుడు థియేటర్స్ బదులు అందరూ కూడా ఓటీటీలపైనే ఎక్కువ ఆధారపడతారు. ఏది ఏమైనా కరోనా ప్రభావం కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలతో వుంది.