ప్రపంచవ్యాప్తంగా కరోనా అందరినీ కలవర పెడుతోంది. అయితే కోలుకున్న కరోనా పేషెంట్లకు మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు లేకపోలేదని దక్షిణ కొరియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అభిప్రాయపడింది. ద.కొరియాలో కరోనా నుంచి బయటపడి క్వారంటైన్లో ఉంటున్న 51 మంది పేషెంట్లకు మరోమారు పరీక్షలు నిర్వహించి చూడగా పాజిటివ్ అని తేలిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్కియాంగ్ వెల్లడించారు. దీంతో వారిని తిరిగి ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలా వైరస్ మళ్లీ తిరగబెట్టడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్కియాంగ్ తెలిపారు. అంతేకాక కొన్ని కేసుల్లో ఓరోజు పాజిటివ్ అని వస్తే, మరోరోజు నెగిటివ్ అని వస్తుందని, దీనిపైనా దృష్టి సారించామన్నారు. కాగా కరోనా సోకిన రోగికి రెండు సార్లు నెగిటివ్ రిపోర్టు వస్తేనే అతను పూర్తిగా కోలుకున్నట్లు భావిస్తారు. ఇదిలా ఉండగా బుధవారం నాటికి ద.కొరియాలో 10,384 కేసులు నమోదు కాగా 6,776 మంది కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు పదిహేను లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా సుమారు 89 వేలమంది మరణించారు. ఇప్పటికే మూడు లక్షల మంది పైచిలుకు దానితో పోరాడి విజయం సాధించారు. అయినప్పటికీ కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకున్నవారి సంఖ్య చాలా తక్కువ.
previous post