కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మరోసారి స్పందించింది. కొవిడ్-19 విషయంలో తాము ముందే హెచ్చరించామని పేర్కొంది. అప్పుడే విని జాగ్రత్తపడితే ఇంత అనర్థం జరిగేది కాదని పేర్కొన్నది. పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి డబ్ల్యూహెచ్వో అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేషన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020, జనవరి 30 నాడే అంతర్జాతీయంగా కొవిడ్-19 అత్యవసర పరిస్థితి ప్రకటించిందని టెడ్రోస్ గుర్తుచేశారు.అప్పటికీ చైనాయేతర దేశాల్లో 82 కేసులు మాత్రమే ఉన్నాయని, ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అప్పుడు తమ హెచ్చరికలు విని జాగ్రత్తపడిన దేశాలు మిగతా దేశాలకంటే మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.