తెలంగాణలో కోవిడ్-19 (కరోనా) వ్యాప్తిని అరికట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ దేశం నుంచి వచ్చినా, నేటి నుంచి విమానాశ్రయంలో దిగే ప్రతి ప్రయాణికుడికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే, వారిని వెంటనే తదుపరి పరీక్షల నిమిత్తం ఎయిర్ పోర్టులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. వారు అక్కడి పరీక్షల అనంతరమే బాహ్య ప్రపంచంలోకి వస్తారని అన్నారు. ఇక అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కోవిడ్-19 ప్రత్యేక వార్డులను సిద్ధం చేశామని, అన్ని అసుపత్రుల్లో నాలుగు నుంచి పది పడకలు రెడీగా ఉన్నాయని, అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను మరింతగా పెంచేందుకు సైతం చర్యలు చేపట్టామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.