కరోనా కట్టడికి లాక్ డౌన్ ను ప్రకటించిన తరువాత ఏప్రిల్ మాసంలో శానిటైజర్ అమ్మకాలు ఊపందుకొన్నాయి. దీంతో మే, జూన్ నెలల్లో భారీగా జరిగిన శానిటైజర్ విక్రయాలు జరిగాయి. ఎక్కడ ఉన్నా చేతులను శుభ్రపరచుకోవాల్సిందేనని ప్రజలు భావించడంతో వీటి అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. జూలైలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఇప్పుడు కేవలం 30 శాతం అమ్మకాలు సాగుతున్నాయి.
మే, జూన్ నెలల్లో దుకాణాల్లో శానిటైజర్ల కొరత విపరీతంగా ఉండేది. కరోనా కారణంగా నష్టపోయిన ఎన్నో మాన్యుఫాక్చరింగ్ సంస్థలు, ప్రజల అవసరాన్ని, డిమాండ్ ను గుర్తించి శానిటైజర్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలు పెట్టాయి. కరోనా వచ్చిన తొలి రోజుల్లో ఉన్న భయం క్రమంగా ప్రజల్లో తగ్గిపోయింది.
రోజుకు వస్తున్న కొత్త కేసుల సంఖ్య వేలల్లో ఉన్నా, ప్రజలు భయపడటం లేదు. కరోనా కూడా మామూలు జ్వరంలాగానే తగ్గుతుందని ప్రజలు నమ్ముతున్నారు. దీంతో శానిటైజర్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కరోనా సోకిన తరువాత రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతూ ఉండటంతో శానిటైజర్లు కొనేవారే కరవయ్యారు. దీంతో ఓ దశలో రూ. 2 వేల వరకూ అమ్మిన శానిటైజర్ క్యాన్ ధర, ఇప్పుడు రూ. 400కు పడిపోయింది.