తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగుల చికిత్సకు అవిగాన్ (ఫావిపిరవిర్) ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ కరోనా డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్ (ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
కరోనా బాధితులకు వేగంగా ఈ ఔషధాన్ని అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 42 నగరాల్లో ఉచిత హోమ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. జపనీస్ దిగ్గజం ఫుజిఫిల్మ్ టొయామా కెమికల్ కంపెనీతో గ్లోబల్ లైసెన్స్ ఒప్పందంలో భాగంగా వీటిని తీసుకొచ్చినట్టు డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. అవిగాన్ రెండు సంవత్సరాల షెల్ఫ్ లైఫ్ తో 122 టాబ్లెట్ల పూర్తి థెరపీ ప్యాక్లో వస్తుందన్నారు.