రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రోగులకు చికిత్సా విధానం విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తాజాగా నిర్దేశించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయనున్నామని వ్యాఖ్యానించారు.
వ్యాధి సోకితే, పది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తామని, ఆపై ఎటువంటి పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్ చేసి, వారం రోజుల పాటు హోమ్ ఐసొలేషన్ లో ఉంచాలని ఐసీఎంఆర్ సూచించిందన్నారు. ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉంటేనే ఆసుపత్రిలో చికిత్స అందించాలని చెప్పిందని ఆయన వెల్లడించారు.
ఐసీఎంఆర్ తాజా సూచనలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఈటల, ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే డెత్ గైడ్ లైన్స్ ను కూడా అమలు చేయనున్నామని అన్నారు. క్యాన్సర్ సహా, ఇతర జబ్బులు ఉండి కరోనా సోకి మరణిస్తే, వారు దీర్ఘకాలిక వ్యాధులతోనే చనిపోయినట్టుగా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. మరణాలకు గల కారణాలను ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. వారిచ్చే డెత్ ఆడిట్ రిపోర్టు ప్రకారమే మరణాలను ప్రకటించాలన్న ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగా రిపోర్టులను తయారు చేస్తున్నామని తెలిపారు.