తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాస్తవాలు కనిపించడం లేవని దుయ్యబట్టారు. గత బడ్జెట్ లెక్కలు తేలకముందే.. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కొత్త బడ్జెట్ పేరుతో గారడికి సిద్ధమయ్యారని విమర్శించారు. గత ఏడాది కూడా లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. అక్షరాస్యత కల్పించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగులో ఉందని సర్వేలో తేలిందన్నారు.
ఆరోగ్యశ్రీ బిల్లులను పెండింగ్లో పెట్టడం వంటి నిర్లక్ష్య ధోరణితో.. పేద రోగుల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నారో అందరికీ అర్థం అయిందన్నారు. చివరకు రైతులకు యూరియా అందించే విషయంలో కూడా కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. తెలంగాణలోని పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరూ చూశారని తెలిపారు. విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరమని విజయశాంతి వ్యాఖ్యానించారు.