రానున్నఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఖండించారు. తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను పోటీ చేయబోతున్నట్టు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్గా తనపై గురుతర బాధ్యత ఉందన్నారు.
ఎన్నికలకు ముందు వచ్చే రెండు నెల్లలో పార్టీ తరపున రెండు, మూడు రాష్ట్రాల్లో నిర్వహించబోయే సభలు, ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉందని విజయశాంతి తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసి ఓ నియోజకవర్గానికి పరిమితం కావాలనుకోవడం సరికాదని విజయశాంతి ట్వీట్ చేశారు.