తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలక్టరేట్ల వద్ద దర్నాకు పిలుపునిచ్చింది. 31 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈరోజు నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కలక్టరేట్లలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వరంగల్ లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేత, నటి విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు నాయిని నర్సింహారెడ్డి, కొండా సురేఖ, కొండేటి శ్రీధర్ లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చి 5 రోజులు గడిచినా కేసీఆర్ మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో బిజీగా ఉన్నాడని విమర్శించారు. 20 మంది పిల్లలు చనిపోయినా ఆయనలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై దొర ఆటలు సాగవని వ్యాఖ్యానించారు. విద్యార్థులు అధైర్యపడి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దనీ, వారికి తాము అండగా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఇంటర్ విద్యార్థుల కోసం తాము ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు.
సునీతతో రోజుకొక మాట మాట్లాడిస్తున్నారు: సీఎం రమేశ్